నిరాకారుడయిన
పరమాత్మ సాకారుడై అనేక అవతారములెత్తిన కర్మభూమి మన భారతదేశము. ధర్మసంస్తాపనార్థం
అవసరమైన ప్రతిసారీ తానే ఈ భూమిపై అవతరిస్తానని గీతలో చెప్పిన విధంగా భగవంతుడు
జనులకు దిశానిర్దేశం చేసి, సన్మార్గంలో, భక్తిమార్గంలో నడిపించడానికి ఎందరో
యోగులు, ఋషులు, అవధూతలు, గురువుల రూపంలో అవతరించిన వేదభూమి మన భారతదేశము.
అటువంటి అవతారపురుషులలో అనంతపురము జిల్లా, విడపనకల్లు మండలము నందు గడేకల్లు
గ్రామాన వెలసిన శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి అగ్రగణ్యులు.
సాక్షాత్తు వేదాలకు మూలమైన పరమేశ్వరుని అంశతోతూర్పు గోదావరి జిల్లాలోని వేములవాడలో
జన్మించినవారు, అఖిలలోకపాలకాను సుశక్తి సంపన్నులు“శ్రీ వేములవాడ
భీమలింగేశ్వరస్వామి”.
నిత్యబ్రహ్మచారిగా ఈయన, తన జీవితం తొలిదశలో, కవీశ్వరునిగా
“శ్రీ వేములవాడ భీమకవిగా” ప్రాశస్త్యం గడించారు. మలిదశలో దైవాంశసంభూతులుగా
భక్తకోటి ఆరాధ్య దైవంగా గడేకల్లున “శ్రీభీమలింగేశ్వరస్వామి”గా నిలిచారు.
భీమకవిగా, ద్రాక్షారామ
భీమేశ్వరుడి వరప్రసాదంగా అమోఘకవితా శక్తిని కలిగి, తన పదవాక్కుతోటి అక్షరాలను రెక్కలుగా మార్చి, విశ్వవిహారం
చేసిన కవియోగి. వాగ్బణము, వాక్ఛాతుర్యము కలిగిన, తన అమోఘవాక్కులతో పాదాశ్రితులకు, ఆరాధకులకు
ఆశీర్వచనాలను, వరాలను గుప్పించే నిత్యశుభకరుడు, అఖిలైశ్వర్యప్రదాయకుడు శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి.ఉద్దండ
కవితావాగ్ధురీణుడై, ఎందరో ప్రభువులను, రాజ్యాధినేతలను తన మృదుమధురపద పద్యపరిమళాలతో రంజింపచేస్తూ, వారికి కొండంత అండగా నిలిచి, నిరంతర
సత్యాన్వేషణ విచక్షణుడై, పరిపాలనాదక్షతలో వారికి
మార్గోపదేశం చేసిన రాజగురువు, పరిపాలక ప్రావీణదర్శుడు
శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి.
“ఆగతానాగతవేదియు సత్యాన్వేశణ
విచక్షనుండును,ఉద్ధండకవితావాగ్ధురీనుండును సకలభూప సభాంతరాళ భీమవాక్య పరిగుంబ్య మాన
గుణుండును, సకలదేశవిద్వత్సభా సంమోదశాస్త్రార్థసార కౌశలుండునూ, ఉదారస్వభావుండును,
నిగ్రహానుగ్రహసుశక్తిసంపన్నుండును, నిఖిలైశ్వర్యప్రధానాశీర్వాదామోఘవాక్భవుండును,
నిరంతర జపతప స్వాధ్యాయ కర్మానుష్ఠాన చరితుండును, నిష్టాగరిష్టుండును, నిర్మల
పరిపూర్ణ మానసోదారుండును, నిఖిలాంధ్రదేశ సంచారిత సద్యశోధురంధరుండును, నగు వేములవాడ
భీమనామాత్యకవిశేఖరుండు సఖలాంధ్ర జనహృదయాంతరాళంబులనిత్య మంగలప్రదుండగుచు నిరంతర
సౌఖ్యప్రధాయియగుచు నితరేతరసమాకర్ష్యమాన సౌఖ్యసంగనితోత్తుంగ
సంతతానందవివర్ధమానుండగుచు నిఖిలసంపత్కరుండగుచు, నిర్ణిద్రమాన శోభాకరుండగుచు
నిరంతరంబ్రకాశించుచుండునుగాక”
భీమకవిని అందరు
నిగ్రహానుగ్రహ సమర్థుడని పిలుస్తారు. ఇదే విషయాన్ని మలకపల్లి పెదశేషయ్య గారు
“ఉద్దండకవి వేములవాడ భీమకవి చరిత్ర”లో ఇలా వివరించారు.
సీ తిట్టినతిట్టు
మొత్తిన పిడ్గు కై వడి
నతి భయంకరముగా నడచి కొట్టు
కరుణించి దీవింపఁ గైలాసపతి మెచ్చి
యిచ్చిన వరముగా నెసక మెసగు
శాపంబు వెట్టిన సద్యోవినిర్భిన్న
భక్ష్యభాండమురీతి బయలఁబడును
క్రమ్మఱించిన శాప కాండంబు లెల్లను
వడిఁబటా పంచలై యడగిపోవు
నిగ్రహానుగ్రహ విలాస నియతమాన
మానసోల్లాసవర్తి సంపత్ప్రపూర్తి
ఘనుడు వేములవాడ భీమన కవీంద్ర
చరిత మానందదాయియై వరలుఁగాత
భావము: తిట్టిన
తిట్టు, గట్టిగా కొట్టే పిడుగు కన్నా వేగముగా చాలా భయంకరముగా వచ్చి తాకుతుంది. అదే
కరుణించి దీవించినపుడు, స్వయానా కైలాసపతైన ఆ పరమేశ్వరుడే ప్రసన్నుడై ఇచ్చిన విధంగా
వరాలను గుప్పిస్తారు. శాపము పెట్టిన తక్షణం వికటించిన ఆహారములాగా తీవ్రప్రభావము చూపిస్తూ
బయటపడుతుంది. ఉపసంహరించినపుడు, శాపప్రభావమంతా సమూలంగా, వేగంగా పటాపంచలై
నశించిపోతుంది.నిరంతరము నిగ్రహ, అనుగ్రహములతో తనలీలలను చూపుతూ, ఎల్లపుడూ
ఆనందమైనదాయకమైన మనసుతో ప్రకాశించేవాడు. సంపదలోసగేవాడు. గొప్పవాడు అయిన వేములవాడ
భీమకవీంద్రుని చరిత్ర అందరికీ ఆనందమును ప్రసాదిస్తూ ప్రకాశించును గాక!
ఇంతటి గొప్ప
మహోన్నతశక్తిభూషణుడు, మహోజ్వలచరితుడి చాటుపద్యాల తేటతెలుగు తీయదనాన్ని నలుగురికీ
అందచేయాలని ఆకాంక్షిస్తూ...శ్రీ వేములవాడ
భీమలింగేశ్వరస్వామి
అధ్యయన
కేంద్రం,, 2017
No comments:
Post a Comment