మైత్రి మహిమ
ఒక అడవిలో లేడి, కాకి, తాబేలు, ఎలుక కలసి జీవిస్తూ ఉండేవి. కాని విపరీత స్వభావాలు కల్గిన ప్రాణులు కావటం వలన పరస్పరం పోట్లాడుకొంటూ ఉండేవి. ఈ పోట్లాటలవల్ల అవి వేటగాళ్లకు చిక్కి మరణిస్తూ ఉండేవి. ఇలా తరతరాలుగా సాగటంవలన వీటి వంశమే లేకుండా పోతుందని భావించి ఒక మహాత్ముడు ఈ నాల్గు ప్రాణులకు కలసి మెలసి జీవించమని ఉపదేశం చేశాడు. ఆయన ఉపదేశ ప్రభావం వలన వీటి అంతరంగంలో మార్పు కల్గి, ఇవి కలసి మెలసి జీవించ నారంభించాయి
ఒకనాడు ఒక వేటగాడు నీటిలో తాబేలును పట్టుకొన్నాడు. మిగిలిన మూడు జంతువులు స్నేహ పాశం బంధించగా, అవి అసమర్థతతో ఊరుకోక తెలివిని ఉపయోగించి తాబేలుని రక్షించాలనుకొన్నాయి. లేడి కుంటుతూ వేటగాని ముందుకు వెళ్లింది. కాకి అతని వీపు పైన వాలింది. వేటగాడు కుంటి లేడిని అవలీలగా పట్టుకొనవచ్చునని చేతిలోని వలను క్రింద వైచి లేడిని వెంబడించాడు ఇంతలో ఎలుక వల కొరికి తాబేలుతో సహా పారిపోయింది. చాలా సేపు లేడు వెంట పరుగెత్తి, లాభంలేక వేటగాడు నిరాశతో వెనుకకు తిరిగి వచ్చాడు. వల కొరికివేయబడి ఉంది. తాబేలు లేదు. ఆ ప్రాంతంలో ఏవైనా అతీంద్రయశక్తులు ఉన్నాయా అని వేటగానికి భయం వేసింది. భయంతో వడివడిగా ఇంటికి పరుగు తీశారు
కలిసిమెలిసి జీవించటంవల్ల, పరస్పరం మైత్రి కల్గి ఉండటం వల్ల సమస్త ప్రాణుల ఎంతటి విపత్తులనైనా అవలీలగా ఎదుర్కొనగలవు. ఏకాకిగా బ్రతికేవారు, సంతులనం కోల్పోయేవారు చిన్న చిన్న విపత్తులకే ఎక్కువ నష్టాన్ని, కష్టాన్ని పొందుతూ ఉంటారు
- ప్రజ్ఞా పురాణం నుండి
No comments:
Post a Comment