మనిషి అంటే మూడు లక్షణాలుండాలి
ఒక ఫకీరు ప్రతిరోజు పగటి పూట రెండు చేతుల్లో రెండు వెలుగుతున్న దివ్వెలను పట్టుకొని బజార్ల వెంట తిరుగుతూ ప్రతి దుకాణం ఎదుట కొంత సేపు నిలబడి ముందుకు సాగిపోయేవాడు. ఇది చూసి ఒక వ్యక్తి “బాబా నీవు పగటిపూట దివ్వెలను చేతబట్టి ఏమి వెతుకుతున్నావు. నీకు ఏమి కావాలి?” అని ప్రశ్నించాడు. దానికి ఫకీరు "నేను మానవులను వెదుకుతున్నానయ్యా! ఇంత పెద్ద సమూహాలలో ఎంతగా గాలించినా ఒక్క మానవుడు కూడా లభించటం లేదని” బదులు పలికాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యంతో “నీకు మనుష్యులంటే తెలియటం లేదా, ఈ చుట్టూ ఉన్నవారు మనుషులు కాకపోతే ఎవరు? అని కుతూహలంతో అడిగాడు. దానికి ఫకీరు కన్నులు మూసికొని “మనిషి అంటే- 1 ఇంద్రియాలకు దాసుడు కాక, ఇంద్రియాలకు అధిపతియై, వాటిని శాసించగల శాసనకర్త 2) క్రోధాగ్నిలో పడి తాను మండుతూ ఆ అగ్ని కణాలతో ఇతరులను నశింపచేసే ప్రయత్నం ఏనాడు చేయనివాడు 3) కామ వాసనలు లేనివాడు. ఈ మూడు లక్షణాలు లేని శరీరధారులందరు మృగములు, నర పశువులు” అంటూ ఫకీరు మానవుని పరిభాషను ఆ వ్యక్తి ద్వారా సమాజానికి తెలియజేశాడు. ఈ జనారణ్యంలో ఈనాడు పై లక్షణాలు గల మానవుల ఆవశ్యకత ఎంతగానో ఉన్నది. పశుస్థాయి నుండి నరుల స్థాయికి చేరటానికి పై మూడు లక్షణాలను అలవరచుకొనే సాధన చేయగల సాధకులుగా ప్రతి ఒక్కరు తయారుకావాలి
- ప్రజ్ఞా పురాణం నుంచి
No comments:
Post a Comment