పృథుశక్తిన్ గజ మా జలగ్రహముతోఁ బెక్కేండ్లు పోరాడి, సం
శిథిలంబై, తన లావు వైరిబలముం జింతించి, మిథ్యామనో
రథమిం కేటికి? దీని గెల్వ సరి పోరం జాలరా దంచు స
వ్యథమై యిట్లనుఁ బూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్.
గజరాజు గొప్పబలంతో అనేక సంవత్సరాలు యుద్ధం జేసి చేసి చివరికి చితికిపోయాడు.తన సత్తువ శత్రువు బలం సరిపోల్చుకొని ఆలోచించుకొన్నాడు “అనవసర ప్రయత్నాలు నాకు ఎందుకు. దీనిని జయించటం, సరిసమంగా పోరాడటం రెండు నాకు సాధ్యంకాదు.”అని దుఃఖించాడు. పూర్వజన్మల పుణ్య ఫలం వలన కలిగిన మేలైన ఙ్ఞానం వల్ల అతడు.ఈ విధంగా అనుకోసాగేడు.
"ఏ రూపంబున దీని గెల్తు? నిటమీఁ దేవేల్పుఁ జింతింతు? నె
వ్వారిం జీరుదు? నెవ్వరడ్డ? మిఁక ని వ్వారిప్రచారోత్తమున్
వారింపం దగువార లెవ్వ? రఖిలవ్యాపార పారాయణుల్
లేరే? మ్రొక్కెద దిక్కుమాలిన మొఱాలింపం బ్రపుణ్యాత్మకుల్.
“ఈ మొసలిని ఏ విధంగా జయించగలను? ఇకపై నేను ఏదేవుణ్ణి ప్రార్థించను? ఎవరిని పిలవాలి? ఎవరు నన్ను రక్షిస్తారు? ఈ మహామొసలిని ఆపేశక్తి కలవారు ఎవరు? సర్వకార్యాలలో దిట్టలు గొప్పపుణ్యాత్ములు దిక్కులేని నా మొర వినేవారు లేకపోతారా. అట్టి వారికిమొరపెట్టుకుంటాను.
నానానేకపయూధముల్ వనములోనం బెద్దకాలంబు స
న్మానింపన్ దశలక్షకోటి కరిణీనాథుండనై యుండి మ
ద్ధానాంభః పరిపుష్ట చందన లతాంతచ్ఛాయలం దుండ లే
కీ నీరాశ నిటేల వచ్చితి? భయం బెట్లోకదే యీశ్వరా!
చాలాకాలం నుంచి అడవిలో ఎన్నో ఏనుగు గుంపుల గౌరవాన్ని పొందుతు ఉన్నాను. పదిలక్షలకోట్ల ఆడ ఏనుగులకు నాథుడుగా ఉన్నాను. నా దానజలధారలతో బలంగా పెరిగిన మంచి గంధంచెట్ల నీడలలో సుఖంగా ఉండకుండ, నీటిమీద ఆశతో ఇక్కడకి ఎందుకు వచ్చాను. భగవంతుడా! చాలా భయం వేస్తోంది. ఎలానో ఏమిటో.
ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో; ఎవరిలో కలిసి ఉంటుందో;ఎవరి లోపల లయం అయిపోతుందో; ఎవరు పరమాత్ముడో; ఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన్నాడో; ఎవరైతే పుట్టడం, గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో; తుది, మొదలు మధ్య లేని అనంతుడో; ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయ్యి ఉంటాడో; అటువంటి స్వయంభువు, ప్రభువు ఐన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను.
ఒకపరి జగములు వెలి నిడి
యొకపరి లోపలికిఁ గొనుచు నుభయముఁ దానై
సకలార్థ సాక్షి యగు న
య్యకలంకుని నాత్మమూలు నర్థిఁ దలంతున్.
ఒకసారి లోకాలను సృష్టి చేసి, ఇంకొకసారి తనలో లయం చేసుకుంటు, ఆ లోకాలు రెండు తానే అయ్యి, అన్ని విషయాలను సాక్షీభూతంగా ఆలోకిస్తూ, ఆత్మలకు ఆత్మ అయిన ఆ పరమాత్మను ఆసక్తితో ధ్యానం చేస్తాను.
లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.
లోకాలు, లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరు నశించిన అనంతరం; ఆ కారు చీకట్లకు ఆవతల అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవుణ్ణి నేను సేవిస్తాను.
నర్తకుని భంగిఁ బెక్కగు
మూర్తులతో నెవ్వఁ డాడు? మునులు దివిజులుం
గీర్తింప నేర? రెవ్వని
వర్తన మొరు లెఱుఁగ? రట్టివాని నుతింతున్.
అనేక వేషాలు వేసే నటుడి లాగ పెక్కు రూపాలతో ఎవరు క్రీడిస్తుంటాడో? ఋషులు దేవతలు ఎవరి గొప్పదనాన్ని వర్ణించ లేరో? ఎవరి ప్రవర్తన ఇతరులకు అగోచరంగా ఉంటుందో? అట్టి ఆ మహాదేవుణ్ణి నేను సంస్తుతిస్తాను.
ముక్తసంగులైన మునులు దిదృక్షులు
సర్వభూత హితులు సాధుచిత్తు
లసదృశవ్రతాఢ్యులై కొల్తు రెవ్వని
దివ్యపదము వాఁడు దిక్కు నాకు.
ప్రపంచంతో సర్వ సంబంధాలు వదలివేసిన మునులు, భగవద్దర్శనం కోరేవారు, సమస్తమైన జీవుల మేలు కోరేవారు, మంచి మనసు కలవారు సాటిలేని వ్రతాలు ధరించి ఎవరి పాదాలను సేవిస్తారో అట్టి భగవంతుడు నాకు దిక్కు అగు గాక.
భవము దోషంబు రూపంబుఁ గర్మంబు నా-
హ్వయమును గుణము లెవ్వనికి లేక
జగములఁ గలిగించు సమయించు కొఱకునై-
నిజమాయ నెవ్వఁ డిన్నియునుఁ దాల్చు
నా పరేశునకు, ననంతశక్తికి, బ్రహ్మ-
కిద్ధరూపికి, రూపహీనునకునుఁ,
జిత్రచారునికి, సాక్షికి, నాత్మరుచికినిఁ-
బరమాత్మునకుఁ, బరబ్రహ్మమునకు,
మాటలను నెఱుకల మనములఁ జేరంగఁ
గాని శుచికి, సత్త్వగమ్యుఁ డగుచు
నిపుణుఁ డైనవాని నిష్కర్మతకు మెచ్చు
వాని కే నొనర్తు వందనములు.
భగవంతుడికి పుట్టుక, పాపము, ఆకారం, కర్మలు, నామాలు, గుణాలు లేవు. అతడులోకాలను పుట్టించడానికి, నశింపజేయడానికి తన మాయా ప్రభవంతో ఇవన్నీ ధరిస్తాడు.అతడు పరమేశ్వరుడు, అంతులేని శక్తి కలవాడు, బ్రహ్మ, నిండైన రూపం గలవాడు, ఏ రూపం లేనివాడు, చిత్రమైన ప్రవర్తన కల వాడు, సర్వసాక్షి, ఆత్మప్రకాశ మైన వాడు, పరమాత్మ, పరబ్రహ్మ, మాటలకు ఊహలకు అందని వాడు, పరిశుద్ధుడు, సత్వగుణంతో దరిజేర దగినవాడు మరియు నేర్పరులు చేసే ఫలాపేక్ష లేని కర్మలను మెచ్చువాడు అయినట్టి ఆ దేవదేవునికి నేను నమస్కారాలు చేస్తాను.
శాంతున కపవర్గ సౌఖ్య సంవేదికి-
నిర్వాణ భర్తకు నిర్విశేషు
నకు; ఘోరునకు గూఢునకు గుణధర్మికి-
సౌమ్యున కధిక విజ్ఞాన మయున
కఖిలేంద్రియద్రష్ట కధ్యక్షునకు బహు-
క్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి
మూలప్రకృతి కాత్మ మూలున కఖిలేంద్రి-
య జ్ఞాపకునకు దుఃఖాంత కృతికి
నెఱి నసత్య మనెడి నీడతో వెలుఁగుచు
నుండు నెక్కటికి, మహోత్తరునకు,
నిఖిల కారణునకు, నిష్కారణునకు న
మస్కరింతు నన్ను మనుచు కొఱకు.
భగవంతుడు శాంతస్వరూపుడు. పరలోక సౌఖ్యప్రదాత. మోక్షానికి అధిపతి. నిర్విశేషుడు. దుష్టులకు భయంకరుడు. సంసారబద్దులకు అందనివాడు. సర్వ గుణ ధర్మాలు కలవాడు. సరళ స్వభావి. విశేషమైన ఙ్ఞానము కలవాడు. సర్వేంద్రియాల కార్యాలను చూసేవాడు. సమస్తానికి ప్రభువు. బహు క్షేత్రఙ్ఞుడు. దయారసానికి సముద్రం వంటివాడు. సర్వానికి ఆది మూల పురుషుడు. ఆత్మకు ఆధారమైనవాడు. సకల ఇంద్రియాలకు నియామకుడు. దుఃఖాన్ని తొలగించేవాడు. మాయ అనే నీడతో ప్రకాశించే బహు నేర్పరి. మిక్కిలి గొప్పవాడు. సమస్తానికి ఆది బీజం అయినవాడు. తనకి మూల కారణం ఏది లేనివాడు. అట్టి ఆ దేవ దేవునికి నన్ను కాపాడ మంటూ నమస్కరిస్తున్నాను.
యోగాగ్ని దగ్ధకర్ములు
యోగీశ్వరు లే మహాత్ము నొం డెఱుఁగక స
ద్యోగ విభాసిత మనముల
బాగుగ వీక్షింతు రట్టి పరము భజింతున్.
యోగీంద్రులు యోగం అనే అగ్నితో తమ సర్వ పూర్వ కర్మలను కాల్చివేసి. ఇతరమైనది మరేది తలచకుండ ప్రకాశించే తమ మనసులలో ఆ దేవదేవుని చూస్తు ఉంటారు. అట్టి ఆ మహానుభావుడిని నేను సేవిస్తాను.
సర్వాగమామ్నాయ జలధికి, నపవర్గ-
మయునికి, నుత్తమ మందిరునకు,
సకలగుణారణిచ్ఛన్న బోధాగ్నికిఁ-
దనయంత రాజిల్లు ధన్యమతికి,
గుణలయోద్దీపిత గురు మానసునకు, సం-
వర్తితకర్మనిర్వర్తితునకు,
దిశ లేని నా బోఁటి పశువుల పాపంబు-
లడఁచువానికి, సమస్తాంతరాత్ముఁ
డై వెలుంగువాని, కచ్ఛిన్నునకు, భగ
వంతునకుఁ, దనూజ పశు నివేశ
దారసక్తు లయినవారి కందఁగరాని
వాని కాచరింతు వందనములు.
పరమేశ్వరుడు సమస్త ఆగమాలు వేదాలు అనే నదులకు సంగమరూప మైన సముద్రము వంటివాడు. మోక్షస్వరూపుడు. గొప్ప గుణాలకు నిలయ మైన వాడు. ఆరణి కొయ్యలలోని అగ్నివలె సుగుణాలలో దాగి ఉండేవాడు. స్వయం ప్రకాశకుడు. గొప్ప మనస్సు కలవాడు. ప్రళయాన్ని సృష్టిని నడిపేవాడు. నాలాంటి ఏ దిక్కులేని జీవుల పాపాలను శమింపజేసేవాడు. సర్వులలోను ఆత్మ యై వెలగువాడు. నాశనం లేనివాడు. పూజింప దగినవాడు. భార్యా పుత్రులు ఇల్లు పశువులు వంటి వాటి యందు ఆసక్తి కలవారికి అందరానివాడు. అటువంటి ప్రభువునకు నమస్కారాలు చేస్తాను.
వరధర్మకామార్థ వర్జితకాములై;-
విబుధు లెవ్వాని సేవించి యిష్ట
గతిఁ బొందుదురు? చేరి కాంక్షించువారి క;-
వ్యయ దేహ మిచ్చు నెవ్వాడు కరుణ?
ముక్తాత్ము లెవ్వని మునుకొని చింతింతు?-
రానందవార్ధి మగ్నాంతరంగు
లేకాంతు లెవ్వని నేమియుఁ గోరక-
భద్రచరిత్రంబుఁ బాడుచుందు?
రా మహేశు, నాద్యు, నవ్యక్తు, నధ్యాత్మ
యోగగమ్యుఁ, బూర్ణు, నున్నతాత్ము,
బ్రహ్మమయిన వానిఁ, బరుని, నతీంద్రియు,
నీశు, స్థూలు, సూక్ష్ము నే భజింతు."
ఇంతేకాకుండా, దేవదేవుడు ధర్మం కామం ధనం అన్నిటి మీద ఆశలు విడిచేసిన పండితుల పూజ లందుకొని వారు కోరుకొన్న ఉత్తమ వరాలు ప్రసాదిస్తాడు. భక్తితో దరిజేరి కోరిన వారికి దయతో నాశనంలేని శరీరాన్ని ఇస్తాడు. ఆనంద సాగరంలో మునిగిన మనస్సులు కల ఏకాంతిక ముక్తులు ఆ దేవదేవుని అనునిత్యం ఆరాధిస్తారు. వారు దేవదేవుని పవిత్ర మైన చరిత్రను కోరికలేమి లేకుండ కీర్తిస్తుంటారు. ఆ మహా దేవుడు సృష్టికన్న ఆద్యుడు. ఇంద్రియ ఙ్ఞానానికి అందనివాడు, అధ్యాత్మ యోగం వలన చేరదగినవాడు. పరిపూర్ణుడు. మహాత్ముడు. బ్రహ్మస్వరూపుడు. సర్వానికి పరమైనవాడు. ఇంద్రియములకు అతీతమైనవాడు. స్థూలస్వరూపుడు, సూక్ష్మ రూపుడు. అట్టువంటి ఆ పరాత్పరుని నేను సేవిస్తాను.
"పావకుండర్చుల, భానుండు దీప్తుల-
నెబ్భంగి నిగిడింతు, రెట్ల డంతు
రా క్రియ నాత్మకరావళిచేత బ్ర-
హ్మాదుల, వేల్పుల, నఖిలజంతు
గణముల, జగముల, ఘన నామ రూప భే-
దములతో మెఱయించి తగ నడంచు,
నెవ్వఁడు మనము బుద్ధీంద్రియంబులుఁ దాన-
యై, గుణ సంప్రవాహంబు నెఱపు,
స్త్రీ నపుంసక పురుష మూర్తియునుఁ గాక,
తిర్య గమర నరాది మూర్తియునుఁ గాక,
కర్మ గుణ భేద స దసత్ప్రకాశిఁ గాక,
వెనుక నన్నియుఁ దా నగు విభుఁ దలంతు.
అగ్ని మంటలను, సూర్యుడు వెలుగుని ప్రసరింజేసి మళ్ళీ శమింపజేసే విధంగానే భగవంతుడు తన కిరణాలచేత బ్రహ్మదేవుడు మొదలైన దేవత లను, సకల జీవరాసులను, సమస్త లోకాలను నానా విధాలైన నామ రూప భేదాలతో సృష్టించి లయింపజేస్తాడు. ఆయన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ తానే అయ్యి గుణాలను ప్రవర్తింప జేస్తాడు. ఆయన స్త్రీ, పురుష, నపుంసక, జంతు, దేవతల, నరులు మొదలగు వారిలో వేటి ఒక్క రూపము కలవాడు కాదు. ఆయన కర్మ గుణ భేదాలకి సత్తు అసత్తులకి అతీతుడు. అంతే కాకుండా అవన్ని కూడ తానే అయ్యి ఉంటాడు. అటువంటి ఆ ప్రభువును నేను స్మరిస్తాను.
కలఁ డందురు దీనుల యెడఁ,
గలఁ డందురు పరమయోగి గణముల పాలం,
గలఁ డందు రన్నిదిశలను,
గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో?
దేవుడు ఆర్తు లైన వారి వెంట ఉంటాడు అని అంటారు. ఉత్తము లైన యోగుల చెంతఉంటా డని అంటారు. అన్ని దిక్కుల లోను ఉంటా డంటారు. “ఉన్నాడు ఉన్నాడు” అనేఆ దేవుడు మరి ఉన్నాడో! లేడో!
కలుగఁడే నాపాలికలిమి సందేహింపఁ-
గలిమిలేములు లేకఁ గలుగువాఁడు?
నా కడ్డపడ రాఁడె నలి నసాధువులచేఁ-
బడిన సాధుల కడ్డపడెడువాఁడు?
చూడఁడే నా పాటుఁ జూపులఁ జూడకఁ-
జూచువారలఁ గృపఁ జూచువాఁడు?
లీలతో నా మొఱాలింపఁడే మొఱఁగుల-
మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱగువాఁడు?
అఖిల రూపముల్ దనరూప మైనవాఁడు
ఆదిమధ్యాంతములు లేక యడరువాఁడు
భక్తజనముల దీనుల పాలివాఁడు
వినఁడె? చూడఁడె? తలఁపడె? వేగ రాఁడె?
నా విషయంలో ఆ భగవంతుడు గురించి అనుమానించాల్సిన పని లేదు. అతడు ఐశ్వర్యంపేదరికం లాంటివి చూడకుండా అందరికి అండగా ఉంటాడు. కాబట్టి నాకు అండగా ఉంటాడు. దుర్జనుల చేతిలో చిక్కుకున్న సజ్జనులకు సాయపడతాడు. అందువల్ల నాకు సాయం చేస్తాడు. బయటి చూపుల వదిలిపెట్టి తననే చూసేవారిని దయతో చూస్తాడు.కనుక నా కష్టాన్ని చూస్తాడు. దీనుల మొరలు విని తన్ను తానే మరచి పోతాడు కదా. నామొర తప్పక వింటాడు. అన్ని రూపాలు ఆయన రూపాలే. మొదలు నడుమ తుద అన్నవి ఆయనకు లేవు. భక్తులకు దిక్కులేని వారికి ఆయనే ఆధారం. మరి అటువంటి ప్రభువు ఇంకా నా మొర వినడేం? నా బాధ చూడడేం? నన్ను దయ చూడడేం? తొందరగా రాడేం?
విశ్వకరు విశ్వదూరుని
విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్
శాశ్వతు నజు బ్రహ్మప్రభు
నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్."
ప్రభువు లోకాన్ని సృష్టించేవాడు. లోకులు అందుకోలేని వాడు. లోకానికి అంతరాత్మఅయిన వాడు. లోకంలో బాగా తెలుసుకోదగిన వాడు లోకమే తానైన వాడు. లోకాతీతుడు. ఎల్లప్పుడు ఉండేవాడు. పుట్టుక లేనివాడు. బ్రహ్మదేవునికి అధినాయకుడు. లోకాన్ని నడిపించేవాడు. పరమాత్మ. అట్టి ఆది పురుషుని నేను ఆరాధిస్తాను.
"లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!
దేవా! నాలో శక్తి కొంచం కూడ లేదు. ధైర్యం సడలి పోయింది. ప్రాణాలు కూడ కదలిపోతున్నాయి. మూర్చ వచ్చేస్తూ ఉంది. శరీరం స్రుక్కిపోయింది. బాగా అలసటగా ఉంది. నాకు నీవు తప్ప వేరే ఇతరు లెవ్వరు నాకు తెలియదు. నీవే దిక్కు. ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్య. ఓ స్వామీ! రావయ్యా! కరుణించు, వరాలిచ్చే ప్రభూ! కాపాడు, పుణ్యాత్ముడా!
విను దఁట జీవుల మాటలు
చను దఁట చనరానిచోట్ల శరణార్థుల కో
యను దఁట పిలిచిన సర్వముఁ
గను దఁట సందేహ మయ్యెఁ గరుణావార్ధీ!
ఓ దయాసాగరా! నీవు సర్వ ప్రాణుల పిలుపులు వింటావట. వారిపై దయ చూపడానికి పోరాని చోట్లకు ఐనా పోతావట. శరణన్న వారికి వెంటనే ఓయ్ అని అంటావుట. కాని ఇప్పుడు ఇదంతా సత్యమేనా అని అనుమానంగా ఉంది.
ఓ కమలాప్త! యో వరద! యో ప్రతిపక్షవిపక్షదూర! కు
య్యో! కవియోగివంద్య! సుగుణోత్తమ! యో శరణాగతామరా
నోకహ! యో మునీశ్వర మనోహర! యో విమలప్రభావ! రా
వే! కరుణింపవే! తలఁపవే! శరణార్థిని నన్నుగావవే!"
ఓ కమలాక్షుడా! ఓ వరాలు ఇచ్చే ప్రభూ! శత్రువులపై కూడ వైరం లేనివాడా! పండితులచే నమస్కారాలు అందుకొనే వాడా! ఉత్తమ సుగుణాలు కలవాడా! శరణు కోరువారికి కల్పవృక్షం వంటివాడా! మునీంద్రులకు ప్రియమైనవాడా! నిర్మలమైన మహిమ కల వాడా! నా మొర విను. వెంటనే రా. కనికరించు. కరుణించి శరణు వేడుతున్న నన్నుకాపాడు.
అని పలికి మఱియు "నరక్షిత రక్షకుండైన యీశ్వరుం డాపన్నుఁడైన నన్నుఁ గాచుఁ
గాక" యని నింగి నిక్కి చూచుచు, నిట్టూర్పులు నిగడించుచు, బయ లాలకించుచు
నగ్గజేంద్రుండు మొఱచేయుచున్న సమయంబున.
ఇలా ప్రార్థించి “రక్షణ లేనివారిని రక్షించే ఆ భగవంతుడు నన్ను కాపాడుగాక!” అని గజరాజు మొరపెట్టుకొన్నాడు. ఆకాశం వైపు నిక్కి నిట్టూర్చాడు. ఆకాశానికి చెవులు అప్పజెప్పి ఆక్రోశించాడు. ఆ సమయంలో