నల్లసిద్ధి భూపాలుడు - భీమకవి


నల్లసిద్ధి భూపాలుడు

                భీమకవిని అత్యంత పూజించి ఆయన కరుణ పొందినవారిలో నల్లసిద్ధిభూపాలుడొకడు. మొదట ఈ రాజు దర్శనము కోసం వచ్చినపుడు, అక్కడి విద్వాంసుడైన కాలనాధభట్టు అంత త్వరగా కలవనివ్వలేదు. భీమకవి కొంతకాలము ఓపికపట్టి వేచి చూసాడు. ఆ తర్వాత ఒక రోజు కాలనాధభట్టుతో “నల్లసిద్ధిభూపాలుని వద్దకు తీసుకెళ్ళెదవా? లేదా నా పద్దతిలో వెళ్ళమంటావా?” అని ఆగ్రహముతో అడిగే సరికి, అతడు “సమస్త శక్తులూ కలిగిన మీకు నేను రాజదర్శనము చేయించవలెనా? మీ సామర్థ్యము మరచి నన్ను అడుగుతున్నారే కానీ, మీవు నేరుగా లోనికి వెళ్ళినా నీకు అడ్డుచెప్పగల వారున్నారా? మీకు ఎందులోనైనా ఎదురుందా?“ అని వినయంగా సమాధానమిచ్చాడు. భీమకవికి “నిజమే. అలా వెళ్ళినా, ఒకవేళ మమ్మల్ని ఎవరైనా అడ్డగించే ప్రయత్నము చేస్తే, మా సామర్థ్యాన్ని చూపించి బాధ పెట్టవలసి వస్తుంది. అది మాకు ఇష్టముండదు. మాకు అడ్డుతగలకుండా ఊరికే ఉంటారని అనుకున్నా, మా శక్తిసంకల్పాలు తిరుగులేనివని తెలుసుకోవడానికి వారి వివేకము చాలదు. అందువలన వారు మూర్ఖులై అడ్డువస్తారు. అలాంటి వారుని కూడా ఇబ్బంది పెట్టకూడదని, మేమే నలుగురితో పాటి ఈమార్గమునే అవలంభించాము“ అని చెప్పారు.  భీమకవి మాటలకు సంతోషించి రాజు వద్దకు తీసుకెళ్ళడు. నల్లసిద్ధిభూపాలుడి ఆస్థానమున భీమకవి దాదాపు ఒక సంవత్సరకాలమున్నారు.  నల్లసిద్ధిభూపాలుడు కూడా భీమకవికి ఏలోటు రానీయకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో చూసుకున్నాడు.

                ఒకనాడు వీరిరువురూ ఊరు దాటి ఒక ఆడవి వైపుకు వెళ్ళారు. ఒక ప్రశాంతమైన ఉద్యానవన ప్రదేశాన్ని చేరారు. అక్కడ పరిమలభరితమై వీస్తున్న చల్లని గాలితో ఎంతో ప్రశాంతంగా ఉంది. భూపాలుడు భీమకవిని చూసి “మహాశయా! ఇట్టి సమయము కవిత్వను చెప్పుటకు చాలా అనువుగా ఉంటుంది కదా?” అని ప్రశ్నించగా, అందుకు భీమకవి  “రాజా! కవిత్వమున కెప్పుడూ ఇటువంటి ప్రశాంతతే కావాలి. ఇప్పుడేదయినా కావ్యమును వ్రాయ మంటావా?” అని అడిగారు. “ మీరు కావ్యమును రచిస్తే నేను విని తరించడానికి సిద్ధముగా ఉన్నాను” అని భూపాలుడు తన సంసిద్ధత తెలిపాడు. అందుకోసం శ్రీరాముని చరితమైన “శతకంఠ రామాయణము” అనే చక్కని ప్రబంధమును రచించి రాజుగారికి వినిపించారు. శతకంఠ రామాయణము నుంచి సంగ్రహించిన ఒక పద్యము.

                             వారక వారకామినుల వర్తులచారుకుచోపగూహముల్
                                కోరక కోరకోల్ల సితకుంజములఁ జిగురాకు పానుపుల్
                                చేరక చారుకేరళ కళింగ కుళింగ నరేంద్ర మందిర
                                ద్వార విహారులై సిరులనందక నందకపాణి కొల్వరే

భావము: ఎన్నటికీ స్త్రీ సౌక్యమును కానీ, సుఖమైన, విలాసవంతమైన జీవితమును కానీ కోరుకోకుండా, రాజ ఆస్థానములను చేరి సిరినంపదలను ఆశింపక, ఎల్లవేళలా నందకపాణి అయిన  శ్రీరామున్ని కొలవండి.
                ఒకప్పుడు నల్లసిద్ధిభూపాలుడి సామంతరాజైన రాజరాజు స్వతంత్రుడు కాదలచి కప్పమును చెల్లించకుండా యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ యుద్ధాన నల్లసిద్ధిభూపాలుడికే  విజయము సిద్ధించింది. రాజరాజు నుంచి యుద్ధానికి అయిన వ్యయానికి గాను 40 లక్షల గద్యాణములను తీసుకొని తరిమితరిమి కొట్టాడు. భీమకవి రాజరాజును తరిమికొట్టాడన్న విషయాన్ని విచిత్రంగా ఈ క్రింది పద్యములో చెప్పారు.

                             వాండిమి నల్లసిద్ధి జన వల్లభుడోర్చిన రాజు భీతుడై
                                యాండ్రన గానకుండ వృషభాంకముఁ బెట్టుకొనంగఁ జూచితో
                                నేండిది యేమినీవనుచు నెచ్చెలులెల్లహసింప నంతలో
                                మూండవ కంటితోడి దొరమూర్తి వహించిన మ్రొక్కిరంగనల్

భావము: వాండిమి నల్లసిద్ధిభూపాలుడు ఓడించిన రాజరాజు, భయకంపితుడై, ఎవ్వరికీ కానరాకుండా వృషభాంకమును(మొఖము కనపడకుండా) ధరిస్తుండడం చూసిన అతని నెచ్చెలులు “ఏమిటిది? ఏమిటి నీవు ఇలా?” అని పరిహసించగా, అంతలో కోపంతో రాజరాజు తన మోఖమును చూపగానే ఆ నెచ్చెలులంతా భయపడి నమస్కరించారు.   

No comments:

Post a Comment

భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...