ఒకనాడు
భీమకవి ద్రాక్షారామములో సప్తగోదావరీతీరాన పందిళ్ళను వేయించి, యాగశాలలను ఏర్పాటు చేసి
మహాసప్తాహము అనే పేరుతో భీమేశ్వరుని ఆరాధిస్తూ ఎన్నో రోజులుగా మాహాయజ్ఞమును
నిర్విరామముగా జరిపించారు. ఈ మహాయజ్ఞమునకు చుట్టు ప్రక్కలప్రాంతాల నుండి వచ్చిన అశేషజనవాహిణికి పగలురాత్రిళ్ళు ఏ లోటు రాకుండా చాలా
గొప్పగా వసతులను కల్పించారు. ఈ మహాక్రతువుకు వచ్చిన జనప్రభంజననానికి
పంచభక్షపరమాన్నాలతో శిష్టకృతిగా భోజనమును పెట్టించారు. అందుకు అవసరమైన పదార్థాలన్నిటినీ తానే మహారాజుకు కబురుపెట్టి
ప్రతిదినము తెప్పించేవారు. ఒకనాటి రాత్రి భోజనాలకు నెయ్యి కొరత ఏర్పడింది. వంటచేసే
బ్రాహ్మణులు నెయ్యి అయిపోయిందని చెప్పారు. భీమకవి ఇంత రాత్రివేళ ఎవరికి కబురు
పంపినా లాభముండదని ఈ క్రింది పద్యమును
చెప్పారు.
శా భీమేశప్రముదంబు సేయఁ గవియౌ భీమన్న సప్తాహము
ల్నీ మంబొప్ప
నొనర్చుచుండ నిచటన్ నేయెంత లేకుండె నీ
ధామంబందున
నీరిమేల్ ఘృతముగాఁ
దత్త్వంబు మాఱించినన్
ధీమంతుల్గొనియాడ
నేయి వగుమా ధీసప్త గోదావరీ
భావము: భీమేశ్వరున్ని సంతోషపెట్టడానికి భీమకవి చేస్తున్న సప్తాహమిది. ఇక్కడ ఎంతో నియమనిష్ఠలతో, నిరాటంకంగా జరుపబడుతోంది. అయితే ఈ ప్రాంతమున నెయ్యి కొంచెము కూడా లేకున్నది. గోదావరి నీటినే నెయ్యి రూపమున మార్చివేస్తే విద్వాంసులు, పండితులు, నిను ఎంతో కొనియాడుతారు. ఓ జ్ఞాన సప్తగోదావరీ నెయ్యిగా మారుమా!
వెంటనే ఆప్రాంతములో గోదావరీమాత నేయ్యిగా
మారి ప్రవహించింది. ఆ నెయ్యిని పాత్రల్లోకి తీసుకొని వచ్చిన వారందరికీ వడ్డించారు.
వచ్చిన వారందరూ తృప్తిగా భోజనం చేసి వారివారి ఇండ్లకు వెళ్ళిన తర్వాత భీమకవి గోదావరినదిని తిరిగి
నీటిగా మారి మునుపటిలా ప్రవహించమని చెబుతూ ఈ పద్యం చెప్పారు.
ఉ వచ్చిన వారలందఱును వారనితృప్తి
భుజించి వైచినన్
జెచ్చెఱ
సంస్తుతించిరికఁ జెందుము నీ తోలిరూపు నీరమై
పెచ్చు
పెఱింగి జీవతతిఁ బ్రీతివహింపగ నింద్రజాలమం
త్రచ్చవి
సప్త గౌతమి! ముదంబల రారఁగ మన్నియుక్తవై
భావము: ఓ సప్త గోదావరీ! వచ్చిన వారందరూ తృప్తిగా భోజనం చేసి, ఎంతగానో
పొగుడుతూ, వెళ్ళిపోయారు. వెంటనే నీ మునుపటి రూపమైన నీరుగా మారి, మిక్కిలి ఉదృతముగా పెరిగి, విజృంభిస్తూ,
భూషణధ్వనులను చేస్తూ గొప్పగా జీవనదియై
ప్రవహించుమా!
నేయ్యిమయమైన గోదావరీనది యథాప్రకారంగా మారి జలమయమై ఉరకలేస్తూ ప్రవహించింది.
నాటి నుండి
ఆప్రాంతజనులంతా భీమకవి ఒనరించిన మహాసప్తాహవైభవమును గురించి “భోజనము పెట్టించిన
భీమకవియే పెట్టించవలెను. శాపమును పెట్టుటను, పెట్టిన శాపమును తీసివేయుటను భీమకవికి
తప్ప ఈ భూమిపై మరి ఎవరికీ సాధ్యము కాని పని“ అని అక్కడకు వచ్చిన వారందరూ
చెప్పుకునేవారు.
No comments:
Post a Comment